క్రికెట్‌లో అరుదైన ఘటన.. బ్యాటింగ్‌ మొదలుకాకముందే 10 పరుగులు!

  • విప్రజ్‌ నిగమ్‌ రెండుసార్లు తప్పిదం
  • పిచ్‌ రక్షిత ప్రాంతంలో పరుగులు
  • రెండుసార్లు ఐదు పరుగుల పెనాల్టీ
  • శ్రీలంక ఇన్నింగ్స్‌ 10/0తో ప్రారంభం
  • ఎంసీసీ నిబంధనల ప్రకారం చర్యలు
క్రికెట్‌లో నోబాల్‌, వైడ్‌, స్లో ఓవర్‌రేట్‌ పెనాల్టీలు చూస్తుంటాం. కానీ ఓ ఆటగాడు చేసిన చిన్న పొరపాటు వల్ల జట్టుకే ఏకంగా 10 పరుగుల జరిమానా పడటం చాలా అరుదు. సోమవారం శ్రీలంక ‘ఏ’తో జరిగిన ట్రైసిరీస్‌ మ్యాచ్‌లో భారత్‌ ‘ఏ’ జట్టుకు అలాంటి చేదు అనుభవం ఎదురైంది. యువ ఆల్‌రౌండర్‌ విప్రాజ్‌ నిగమ్‌ చేసిన తప్పిదం కారణంగా ప్రత్యర్థి జట్టు ఇన్నింగ్స్‌ను నేరుగా 10/0 స్కోరుతో ప్రారంభించింది.

విప్రజ్‌ నిగమ్‌ బ్యాటింగ్ చేసే సమయంలో మ్యాచ్‌లో పిచ్‌పై ఉన్న రక్షిత ప్రాంతంలో (ప్రొటెక్టెడ్‌ ఏరియా) రెండుసార్లు పరుగెత్తాడు. అంతకుముందే మరో భారత బ్యాటర్‌ అనుకుల్‌ రాయ్‌కు ఇదే విషయంపై అంపైర్లు హెచ్చరించారు. ఆ తర్వాత విప్రజ్‌ కూడా అదే తప్పు చేయడంతో అంపైర్లు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. అయితే 37వ ఓవర్‌లో మరోసారి విప్రాజ్‌ పిచ్‌ మధ్యలోనే పరుగెత్తడంతో రెండోసారి కూడా ఐదు పరుగుల జరిమానా విధించారు.

దీంతో మొత్తం 10 పరుగులు శ్రీలంక ‘ఏ’ ఖాతాలో జమయ్యాయి. ఫలితంగా వారు బ్యాటింగ్‌ ప్రారంభించే సమయానికి స్కోరు బోర్డుపై నేరుగా 10/0 కనిపించింది. ఈ అరుదైన ఘటన చూసి కామెంటేటర్లు, అభిమానులు ఆశ్చర్యపోయారు.

ఎంసీసీ నిబంధనల ప్రకారం బ్యాటర్లు ఉద్దేశపూర్వకంగా లేదా అవసరం లేకుండా పిచ్‌లోని రక్షిత ప్రాంతాన్ని దెబ్బతీసేలా నడవకూడదు. ఒకసారి హెచ్చరించిన తర్వాత అదే ఇన్నింగ్స్‌లో మళ్లీ తప్పు జరిగితే ఫీల్డింగ్‌ జట్టుకు ఐదు పెనాల్టీ పరుగులు ఇవ్వొచ్చు. భారత్‌ ‘ఏ’ బ్యాటర్లు రెండుసార్లు అదే నిబంధనను ఉల్లంఘించడంతో మొత్తం 10 పరుగుల శిక్ష పడింది.

Vipraj Nigam
India A vs Sri Lanka A
Cricket penalty runs
Pitch protected area rule
Anukul Roy
MCC cricket rules

More Telugu News